Pages

Friday, October 18, 2013

స్వామి వారి స్వప్న వృత్తాంతం

కలలు కనండి ... వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి ... అని పెద్దాయన మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం యువతకు పిలుపునిచ్చారు గతంలో .... వర్తమానంలో యువత అలా కలలు కంటోందో లేదో గానీ। సాధూమహరాజ్ లు మాత్రం తెగ కలలు కనేస్తున్నారు। సాధువులు స్వాములు అంటే దైవ సాన్నిధ్యంలో ధ్యానం చేస్తూ మానవులకు సక్రమ మార్గంలో జీవనం సాగించేందుకు బోధనలు చేస్తరని ఇప్పటి వరకూ అనుకున్నా ... కానీ వారు కూడా కలలు కంటారనిన్నీ, ఆ కలల్లో దేవుడికి బదులుగా మరకత మాణిక్యాలూ వజ్రవైఢూర్యాలు స్వర్ణఖచిత సింహాసనాలూ పట్టు పీతాంబరాలూ దర్శనం ఇస్తాయని తాజాగా తెలిసి ఆశ్చర్యం వేసింది। సదరు స్వామి వారికి కల రావడం ఆ స్వప్న వృత్తాంతం రాజావార్ల చెవిన పడడం జరిగిపోయింది।  సాధుజన స్వప్నవృత్తాంతం విన్న రాజావారు వెంటనే నిధినిక్షేపాల వేటలో నిష్ణాతులయిన సిబ్బందిని రంగంలో దించేశారు । వారంతా చెమటోడ్చి కనబడిన చోటల్లా తవ్వుకుంటూ పోతున్నారు।
ఈ వివరం తెలిశాక నాకు అర్ధం అయిన నీతి ఏమంటే రాజ్య ప్రజలు యావన్మంది పని పాటలు మానేసి తిండీ తిప్పలు వదిలేసి కలలు కనండి .... నిధినిక్షేపాలు కలలో కనబడితే రాజావారికి చెప్పండి। పైసా ఖర్చు లేకుండా ఇళ్ళన్నీ తవ్వించేస్తారు। కల నిజం అయిందా ఒళ్ళంతా బంగారమే। కాదంటే తవ్విన గోతులు భవిష్యత్తులో మీకే పనికొస్తాయి।

ఎడబాటు


నీకు నేనంటే ఇష్టమని తెలుసు
వేకువ నుండీ నాకోసం ఎదురు చూస్తావనీ తెలుసు।
నేవచ్చే సరికి పడమటి సంధ్యల్లో ఒదిగిపోతావు
ఈ ఎడబాటు ఏకాంతవాసం
మనకింకెన్నాళ్ళు?
-రామచంద్ర శర్మ గుండిమెడ 17/10/2013